Digital Kasipet:-
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రచన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాలను, అవమానాలను గుర్తు చేసు కుందాం!
- బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించాకుండా కాంగ్రెస్ నాయకులు చేసిన ఆటంకాలు, కుట్రల గురించి తెలుసుకుందాం!
భారతదేశంలోని ప్రతి పౌరుడు సగౌరవంగా జీవించేందుకు బహుజన బాంధవ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ప్రవేశపెట్టాడు. దేశంలో 85 శాతం ఉన్న బహుజనులు అందరికీ రాజ్యాధికారం వైపు తీసుకరావాలని బాబాసాహెబ్ కలలుకన్నాడు. గాంధీ, కాంగ్రెస్ నాయకులు చేసిన ద్రోహం 'పూనా ఒప్పందం' వల్ల స్వాతంత్రానికి ముందు ప్రత్యేక నియోజకవర్గాలను సాధించలేకపోయాడు. పూనా ఒప్పందం వల్ల బహుజన వర్గాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు స్వేచ్ఛగా సమానత్వం గా జీవించే హక్కులను రాజ్యాంగం ద్వారా కల్పించాడు. రాజ్యాంగ విప్లవం ద్వారా బ్రాహ్మణీయ మనువాద శక్తులను అడ్డుకుని బహుజనులు అందరికీ రక్షణగా నిలబడ్డా మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్.
భారతదేశంలో రాజ్యాంగ అమలుకు ముందు గత రెండు వేల సంవత్సరాలుగా మనుధర్మ శాస్త్రం ఆధారంగానే పరిపాలన సాగింది. మనుధర్మ శాస్త్ర పాలనలో 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బహుజను లకు చదువు,స్వేచ్ఛా స్వాతంత్రాలు లేక కట్టుబానిసలా గానే జీవించారు.
మనుధర్మ శాస్త్రాన్ని కి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మహర్ ధర్మ శాస్త్రానికి ( రాజ్యాంగానికి )తేడాలు తెలుసుకుందాం!
మనుధర్మ శాస్త్రం ప్రకారం చదువు బ్రాహ్మణులకు, పరిపాలన క్షత్రియులకు, వ్యాపారం వైశ్యులకు పరిమితమైంది. ఏ కులం వారు ఆ కులవృత్తిని కుల ధర్మంగా చేపట్టాలని, స్త్రీలకు ఎలాంటి స్వేచ్ఛా, స్వాతంత్రాలు లేవని ప్రకటించింది. బాల్య వివాహాలు చేయడం, బాల్యంలో భర్త చనిపోతే వితంతువులు పునర్వివాహాలు చేసుకోవద్దని, భర్త చనిపోతే అదే చితిపై భార్యను కూడా కాల్చి వేయాలనే సతీసహగమనం లాంటి దుర్మార్గపు ఆచారాలు అమలు జరిగాయి.
భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అన్ని కులాల వారికి చదువుకునే స్వేచ్ఛ లభించింది. పరిపాలన క్షత్రియుల కే పరిమితం కాకుండా అన్ని కులాల వారు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చింది. ఉదా: టీ కొట్టు అమ్ముకునే నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి అయ్యాడు. వ్యాపార రంగంలో వైశ్యులు కాకుండా అన్ని వర్గాలకు అవకాశం వచ్చింది. కులాన్ని బట్టి కాకుండా ఎవరైనా ఏ పనైనా తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలతో ఏ వృత్తి అయిన చేపట్టవచ్చని తెలిపింది. ప్రతి మహిళా స్వేచ్ఛ గా చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు,చట్టసభలకు వెళ్లొచ్చ ని తెలిపింది. బాల్య వివాహాలు రద్దయ్యాయి. వితంతువులు పునర్వివాహాలు చేసుకోవచ్చని తెలిపింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ : వితంతువుగా ఇంటికి పరిమితం కావాల్సిన శ్రీమతి ఇందిరా గాంధీ "అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమాని దేశ ప్రధానిగా అయ్యానని" తాను స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ను కొనియాడారు.
పేదల పెన్నిధి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని బహుజనులకు ఎన్నో హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచాడు. పాలకవర్గాలు కుట్రపూరితంగా వాటిని మనకు తెలవకుండా చేస్తున్నాయి. రాజ్యాంగంలో రాసిన హక్కులు బహుజనులకు తెలిస్తే వారు ప్రశ్నించడం మొదలు పెడితే పరిపాలన సాగించలేమని గ్రహించాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తున్నా, రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా అందులో ఏ హక్కులు తమకు ఉన్నాయో తెలియని దీనస్థితిలో ఈరోజు బహుజన సమాజం ఉంది. అందులో మన తప్పు కూడా ఉంది. రాజ్యాంగంలో ఏం రాసిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉందని గ్రహించగలరు.
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి అంతర్జాతీయ అవార్డు కోసం ఆస్కార్ కు ఎంపికైన చలన చిత్రం' జై భీమ్' చలన చిత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన చిన్న హక్కు మీద తీశారు. అకారణంగా పోలీసులు అరెస్టు చేస్తే హైకోర్టుకు వెళ్లి 'హేబియస్ కార్బన్ పిటిషన్' వేసి తెలుసుకోవచ్చని హక్కు మీద సినిమా తీశారు. సినిమా దేశంలో పెద్ద సంచలనం అయింది. జై భీమ్ సినిమా లో జరిగినటువంటి ఘటనలు దేశంలో వివిధ రాష్ట్రాల్లో నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మానవ హక్కులు ఎన్నో రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. పోలీసు అధికారుల నుండి, ప్రభుత్వ అధికారుల, రాజకీయ నాయకుల అవినీతి అక్రమాల నుండి తమను తాము రక్షించుకునే ఎన్నో హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి.వాటిని తెలుసుకొని మన బహుజన వర్గాలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదులపై ఉంది.
రాజ్యాంగం రాసేందుకు అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు.
దేశంలోని 85 శాతం ఉన్న బహుజనుల అందరికీ స్వేచ్ఛా, సమానత్వం, విద్యా, ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్ సాధించి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాజ్యాంగాన్ని రచించిన క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలకు, చీత్కారాలు గురయ్యాడు. బ్రాహ్మణీయ భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశ స్వాతంత్ర సమరయోధులు గా పిలవబడే మహాత్మా గాంధీ, నెహ్రూ వల్లభాయి పటేల్ లాంటి బహుజన ద్రోహుల కుట్రలను చేదిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి మన చేతిలో పెట్టాడు. రాజ్యాంగం రాయడంలో తాను పడ్డ కష్టాలను ఈరోజు మన బహుజన సోదరులంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చీకటి చరిత్రంతా రికార్డు చేయబడి ఉంది.
రాజ్యాంగం రాయకుండా అడ్డంకులు!
బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేందుకు ఒప్పుకుని 1946 మార్చి 30 న క్రిప్ట్ కమిషన్ను నియమించారు. దీని ప్రకారం ముందు రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకుని రాజ్యాంగాన్ని రాసుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి గాంధీ కాంగ్రెస్ నాయకులకు సూచించింది. ప్రపంచ మేధావిగా పేరుగాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ తో రాజ్యాంగం రాయిస్తారు అని అందరూ అనుకున్నారు. బ్రాహ్మణీయ భావజాలంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం అంటరానివాడు ఈ దేశానికి రాజ్యాంగం రాయటం ఏంటని వేరే వారితో రాయించేఅందుకు చాలా ప్రయత్నాలు చేశారు. బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్రం పొందిన 18 దేశాలకు రాజ్యాంగాన్ని రాసిన బ్రిటన్ కు చెందిన ప్రొఫెసర్ జేమ్స్ వద్దకు ప్రత్యేక విమానంలో మన దేశానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాజగోపాలచారి, సరోజిని నాయుడు , రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు లండన్ వెళ్లి సంప్రదించారు." రాజ్యాంగం రాయడానికి మీరు ఇంతదూరం ఎందుకు వచ్చారు. మీ దేశంలోనే గొప్ప మేధావి అంబేద్కర్ వుండగా అని ప్రొఫెసర్ జేమ్స్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఇతర దేశాల రాజ్యాంగాలను రాసేటప్పుడు ఏమైనా అనుమానాలు, తెలియని విషయాలు ఏమైనా ఉంటే అంబేద్కర్ గారిని అడిగి తెలుసుకుని రాజ్యాంగాలు వ్రాయడం జరుగుతుందని తెలిపాడు. మీ దేశంలోని రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ లాంటి అపార మేధావి ఉండగా నేను రాయడం సముచితం కాదని సున్నితంగా తిరస్కరించారు. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులు చేసేదిలేక ఇండియాకు తిరిగి వచ్చారు.
రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా అడ్డంకులు!
రాజ్యాంగాన్ని రాసే సంఘంలో ఉండే సభ్యుడు తప్పకుండా రాజ్యాంగ సభకు ఎన్నిక కావాల్సి ఉండే నిబంధనను బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారు. రాజ్యాంగ సభకు ఎన్నిక కాకపోతే రాజ్యాంగం రాయలేడని ఎన్నో పన్నాగాలు పన్నారు. "అంబేద్కర్ను రాజ్యాంగ సభకు ఎన్నిక కానిచ్చే ప్రసక్తి లేదని, పార్లమెంట్ తలుపులు కాదు కదా, కిటికీలు కూడా తెరిచే ప్రసక్తి లేదని" భారత స్వాతంత్ర పోరాటంలో ఉక్కు మనిషిగా పిలువబడ్డా వల్లభాయ్ పటేల్ బహిరంగంగా ప్రకటించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు బొంబాయి నుండి పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకులు ఒక అనామకుడుని నిలబెట్టి మందు, విందు పార్టీలతో ఓటర్లను మభ్యపెట్టి ఓడించారు. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎంపిక కాకుంటే దేశంలోని బహుజనులు అందరికీ ఎంతో నష్టం జరుగుతుందని అంబేద్కర్ వాదులు ఆందోళనకు గురయ్యారు. బెంగాల్ కు చెందిన నామ శూద్ర కులానికి చెందిన జోగిందర్ సింగ్ మండల్ తన ప్రజాకర్షక పార్టీ తరఫున జైసూర్ కుల్నార్ నుండి పోటీకి నిలబెట్టి గెలిపించుకున్నారు. బెంగాల్ నుండి అంబేద్కర్ రాజ్యాంగ సభకు గెలవడం కాంగ్రెస్ వాదులకు మింగుడు పడలేదు. మళ్లీ కుట్రలు చేశారు. దేశవిభజన సందర్భంగా 50 శాతంకు పైగా ముస్లింలు ఉన్న ప్రాంతాలను పాకిస్థాన్లో చేర్చాలని బ్రిటిష్ ప్రభుత్వం నిబంధన విధించింది. దీన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ ను గెలిపించిన బెంగాల్లోని నాలుగు జిల్లాలలో 57 శాతం హిందువుల ఉన్నాకూడా నిబంధనలకు విరుద్ధంగా పాకిస్తాన్లో కలిపేశారు. అంబేద్కర్ వెళ్లి పాకిస్థాన్లో రాజ్యాంగం రాసుకోవాలని హేళన చేశారు. రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా అంబేద్కర్ను రెండోసారి కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. చేసేదిలేక అంబేద్కర్ బ్రిటన్ లోని లేబర్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న అతని మిత్రుడు చర్చిల్ దృష్టికి ఈ ఉదంతాలు తీసుకెళ్లాడు. చర్చిల్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలు అన్ని అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ దృష్టికి తీసుకు వెళ్లాడు. దీంతో ఆగ్రహం చెందిన బ్రిటిష్ ప్రధాని రాజ్యాంగ సభకు అంబేద్కర్ ఎన్నిక కాకుంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ప్రసక్తి లేదని ప్రకటించాడు. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికైన తరువాతనే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే తేదీని ప్రకటిస్తామని బ్రిటిష్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో హడలిపోయిన కాంగ్రెస్ నాయకులు హడావిడిగా సమావేశమై పూనా నుండి ఎన్నికైన బారిస్టర్ జయకర్ చేత రాజీనామా చేయించి అంబేద్కర్ ను రాజ్యాంగ సభకు ఏకగ్రీవంగా 9 july 1947 లో ఎన్నుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికైన మరుసటిరోజు 10 july 1947 రోజు బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశానికి15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్రం ఇస్తున్నామని ప్రకటించారు.
రాజ్యాంగ రచనలో కూడా అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
రాజ్యాంగ రచనా సంఘంలో ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పడింది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 26 నవంబర్ 1949 లో భారత రాజ్యాంగం ఆమోదించబడింది. 26 జనవరి 1950 రోజు భారత రిపబ్లిక్ గా ప్రకటించబడింది.
రాజ్యాంగ రచనలో కూడా అంబేద్కర్ ను నాయకులు అడుగడుగునా అడ్డగించారు. భారతదేశంలో పేదరికం పోయి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే భూమిని, పరిశ్రమలను,సహజ సంపదను జాతీయం చేసి ప్రజల అందరికీ సమానంగా పంచాలని రాజ్యాంగంలో చేరిస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డగించి తొలగింప చేశారు. అంబేద్కర్ సూచించిన పద్ధతిలో భూమిని,పరిశ్రమలను జాతీయం చేస్తే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశం గా ఉండేది. ఈ దేశంలోని బహుజనుల అందరికీ కనీస హక్కులను కల్పిస్తున్నది భారత రాజ్యాంగం అంటే పాలకులకు ఇష్టం లేదు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బ్రాహ్మణీయ భావజాలం ఉన్న కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు మొదటి నుండి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎగగొట్టేందుకు ప్రభుత్వ పరిశ్రమలన్నిటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. వీటి పట్ల అంబేద్కర్ వాదులు చైతన్యవంతమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అంబేద్కర్ వాదులు అవగాహన చేసుకుంటూ ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. అంబేద్కర్, పూలే ఆలోచన విధానం తో బహుజన రాజ్య స్థాపన కోసం అంబేద్కర్ వాదులంతా ఒక్కటై పోరాడాలని ఆశిస్తూ...
ఇట్లు
పల్లె మల్లయ్య
అధ్యక్షుడు
సామాజిక చైతన్య వేదిక